మార్కెట్‌ నుంచి తప్పుకోవడమే

18 Jan, 2017 03:06 IST|Sakshi
మార్కెట్‌ నుంచి తప్పుకోవడమే

బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌ ప్రధాని ∙ప్రపంచ దేశాలతో కొత్త ఒప్పందాలకు చర్చలు
లండన్‌: బ్రెగ్జిట్‌ అంటే ఒక్క యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మార్కెట్‌ నుంచి తప్పుకోవడం మాత్రమేనని, భారత్‌ వంటి దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతున్నామని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. ఈయూ మార్కెట్‌ నుంచి రెండేళ్లలో విడతల వారీగా నిష్క్రమిస్తామని తెలిపారు. ఈయూ నుంచి బ్రిటన్‌ తప్పుకోవడం(బ్రెగ్జిట్‌)పై ఆమె మంగళవారమిక్కడ అధికారులు, విదేశీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. బ్రెగ్జిట్‌కు సంబంధించిన తుది ఒప్పందంపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈయూతో పూర్తిగా సంబంధాలు తెంపుకునే ఉద్దేశం తనకు లేదన్న ఆమె బ్రెగ్జిట్‌ కోసం 12 సూత్రాల కార్యాచరణను ప్రకటించారు.

‘ఈయూకు మంచి పొరుగు దేశంగా ఉండాలనుకుంటున్నాం. అయితే బ్రిటన్‌ను శిక్షించే ఒప్పందం కావాలని కొందరంటున్నారు. అదే జరిగితే ఈయూ దేశాలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. మేం చైనా, బ్రెజిల్‌ వంటి ప్రపంచ దేశాలన్నిటితో వ్యాపారం చేయాలనుకుంటున్నాం. భారత్, న్యూజి లాండ్‌ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించాం’ అని చెప్పారు. వలసలపై నియంత్రణ,బ్రిటన్‌లోని ఈయూ పౌరులకు, ఈయూలోని బ్రిటన్‌ పౌరులకు హక్కులు, ఈయూతో పన్ను రహిత ఒప్పం దంలాంటివి మే ప్రతిపాదనల్లో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు