విధినిర్వహణలో మరణించిన జర్నలిస్టుల జాబితా

13 Feb, 2016 21:40 IST|Sakshi
విధినిర్వహణలో మరణించిన జర్నలిస్టుల జాబితా

ప్రపంచవ్యాప్తంగా గతేడాది మరణించిన జర్నలిస్టులు, ఇతర మీడియా సిబ్బంది వివరాలను ఓ తాజా నివేదిక వెల్లడించింది.  విధి నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేయడంలో ముందుండే పాత్రికేయులకు... ఇటీవల ప్రాణహాని ఎక్కువైనట్లుగా ఈ తాజా లెక్కలు చెప్తున్నాయి. రాజకీయ, సామాజిక వార్తలేకాక యుద్ధాలు, తిరుగుబాట్లు, ఆందోళనల సమయంలోనూ ప్రాణానికి తెగించి వార్తలను సేకరించే పాత్రికేయులు 2015లో 111 మంది వరకూ మరణించినట్లుగా లండన్ కు చెందిన విశ్వవిద్యాలయం తాజా నివేదికలో తెలిపింది.

లండన్ వేల్స్ ప్రాంతంలోని కార్డిఫ్ విశ్వవిద్యాలయం.. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల జాబితాను సేకరించింది. 2015 విద్యాసంవత్సరానికి చెందిన పరిశోధక బృందం.. 'కిల్లింగ్ ది మెసెంజర్' పేరున ప్రపంచవ్యాప్త సర్వే నిర్వహించి, జర్నలిస్టుల మరణాలపై  నివేదికను రూపొందించింది. యుద్ధభూమిగా మారిన సిరియా ప్రాంతంలో అధికశాతం జర్నలిస్టుల మరణాలు చోటుచేసుకున్నట్లు ఈ తాజా లెక్కలు చెప్తున్నాయి. 2015 లో ఒక్క సిరియా ప్రాంతంలోనే పదిమంది పాత్రికేయులు విధినిర్వహణలో మరణించినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారిలో టీవీ జర్నలిస్టులు 38, ప్రింట్ పబ్లికేషన్స్ కు చెందిన వారు 30, రేడియో కు చెందినవారు 27 మంది ఉన్నట్లు నివేదిక తెలిపింది. వీరిలో సగానికి పైగా జర్నలిస్టులు శాంతికాల సమయంలోనే మరణిచారని, వీరిలో పదిమంది మాత్రమే హత్యకు, అరెస్టుకు గురైనట్లుగా అంతర్జాతీయ వార్తల భద్రతా సంస్థ (ISNI) గుర్తించింది.

గత సంవత్సరం మొదట్లో సిరియా దాని సరిహద్దుల్లోని జర్నలిస్టులను అతి దారుణంగా హత్య చేసి ఐసిస్.. తన సందేశాన్నివ్యాప్తి చేసే సాధనంగా వాడుకుంది.  సంవత్సరం మొదట్లో పారిస్ కు చెందిన చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడులు జరిపి ఎనిమిదిమంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంది. హత్యకు గురైన వారిలో ఎక్కువశాతంమంది వారి సాధారణ పనులకు వెళ్ళిన స్థానిక పాత్రికేయులే ఉన్నారని, వారంతా  పౌర యుద్ధాలు, అంతర్జాతీయ విభేదాలతో ప్రమేయం లేనివారని కార్డిఫ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఐఎస్ఎన్ఐ ఛైర్మన్ శాంబ్రూక్ వెల్లడించారు. 

 

మరిన్ని వార్తలు