రోమ్ : ఇటలీ..ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుంది. కానీ కోవిడ్ అనే ఉపద్రవం పెను ప్రమాదంలా మారి అందమైన ప్రాంతాన్ని కాస్తా శవాల గుట్టలుగా మార్చేసింది. లాక్డౌన్ కారణంగా సొంతింటికి వెళ్లలేక, కుటుంబసభ్యులను కలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో మయామికి చెందిన కళాకారుడు అల్వారో సోలార్జానో కూడా ఉన్నారు. ప్రస్తుతం ముస్సోమెలిలో చిక్కుకున్న ఆయన..తన అనుభవాలు,అక్కడి పరిస్థితులను వివరించారు. (కరోనా: ఇటలీలో ఇదే మొదటిసారి! )
" పొల్యూషన్కి దూరంగా, అది కూడా అతి తక్కువ ధరకు ఇళ్లు దొరకడంతో ముస్సోమెలిలో గత సంవత్సరం రెండు ఇళ్లు కొనుక్కున్నాను. ఇంటికి మరమ్మత్తులు చేపిద్దాం అని అక్కడికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక లాక్డౌన్ ప్రకటించారు. కొత్త ఇళ్లు కావడంతో కనీసం ఫర్నిచర్ కూడా లేదు. మొదట్లో చలి తీవ్రతకి చాలా కష్టంగా అనిపించేది. అయితే ఇరుగుపొరుగు వారు నా పరిస్థితిని గమనించి చాలా సహాయం చేస్తున్నారు. ఈస్టర్ రోజున వారు ఇచ్చిన భోజనం మొత్తం తినడానికి నాకు మూడు రోజులు సమయం పట్టింది. వాళ్ల ఉదారతకు ఎప్పటికీ మర్చిపోను. అయితే టీవీ చూడటం, మార్కెట్కు వెళ్లిరావడం, ఇంటి మరమత్తులు చేస్తూ అలా కాలాన్ని వెళ్లదీస్తున్నాను. మా ఫ్యామిలీ తిరిగి ఇక్కడికి చేరుకునేలోపు ఇంటిని అందంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయా" అంటూ వివరించారు. ఇటలీలోని హిల్ ఆఫ్ హనీ గా పిలిచే ఈ ప్రాంతంలో చాలా చౌకగా ఇళ్లు దొరుకుతాయి. ఒక డాలర్ లేదా అంతకంటే తక్కువగానే ఇళ్లు మీ సొంతం అవుతుందన్నమాట. దీంతో పొల్యూషన్కి దూరంగా అందమైన ప్రకృతిలో సేదతీరాలనుకునే వారికి ఈ ప్రాంతం చక్కని నివాసయోగ్యంగా మారింది. దీంతో చాలామంది సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రటీల వరకు ఈ అందమైన ప్రాంతంలో సేదతీరడానికి ఆసక్తి చూపుతున్నారు. (ఇటలీ తరహాలో భారత్లో లాక్డౌన్! )