మ్యూజియంపై దాడి : విలువైన వస్తువులు మాయం

26 Nov, 2019 12:17 IST|Sakshi

లండన్‌ : తూర్పు జర్మనీలోని డ్రెస్డెన్‌ మ్యూజియంపై మెరుపు దాడి చేసిన దొంగలు అక్కడి డిస్‌ప్లే కేసులను ధ్వంసం చేసి శతాబ్ధాల నాటి విలువైన బంగారు, వజ్రాభరణాలతో పాటు విలువైన వస్తువులను అపహరించారు. మ్యూజియంలోని గ్రీన్‌వాల్ట్‌ భవనంలోకి సోమవారం తెల్లవారుజామున చొరబడిన దొంగలు వజ్రాలు, రూబీలు సహా 18వ శతాబ్దానికి చెందిన మూడు సెట్ల ఆభరణాలను ఎత్తుకుపోయారని మ్యూజియం సిబ్బంది వెల్లడించారు. గ్రిల్డ్‌ విండోను పగులకొట్టిన ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్‌లో వెల్లడైంది. తెల్లవారుజామున 5 గంటలకు అలారం మోగిన ఐదు నిమిషాలకే అధికారులు అక్కడికి చేరుకున్నా దోపిడీ దొంగలు అప్పటికే పరారయ్యారు. దొంగలు విలువైన వస్తువులతో ఆడి కారులో పరారైనట్టు పోలీసులు గుర్తించారు.

అత్యంత పకడ్బందీగా వ్యవహరించిన దుండగులు మ్యూజియంలోకి విద్యుత్‌ సరఫరా వైర్‌ను కట్‌చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. ఘన చరిత్ర, సంస్కృతి కలిగిన విలువైన ఆభరణాలను దొంగిలించారని మ్యూజియం డైరెక్టర్‌ డిర్క్‌ సిండ్రం తెలిపారు. ఈ వినూత్న అమూల్యమైన ఆభరణాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం సాధ్యం కాదని పొరుగున ఉన్న సక్సోనీ స్టేట్‌ డైరెక్టర్‌ మ్యూజియమ్స్‌ మేరి అకర్‌మన్‌ చెప్పుకొచ్చారు. కాగా, మ్యూజియంలో విలువైన వస్తువుల చోరీ విలువ రూ 7000 కోట్ల వరకూ ఉంటుందని బిల్డ్‌ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది. దుండగులను అదుపులోకి తీసుకుని మ్యూజియం వస్తువులను రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు