ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లిపోయారు

21 Aug, 2017 20:29 IST|Sakshi


వాషింగ్టన్‌:
టెక్నాలజీ నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి నేరాలు జరిగినా ఇట్టే పట్టేస్తున్నారు పోలీసులు. అయితే అర్కన్‌సాస్‌ పట్టణ పోలీసులకు మాత్రం ఓ చోర్‌ బ్యాచ్‌ పెద్ద సవాల్‌నే విసిరింది. ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లి అవాక్కయ్యేలా చేసింది. 
 
ఆగష్టు 16న జరిగిన ఈ దొంగతనం వీడియోను కాన్వే పోలీసులు రిలీజ్‌ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఓ పెద్ద ట్రక్కుతో ఏటీఎం సెంటర్‌ను పగలకొట్టుకుంటూ వెళ్లిన నిందితులు మిషన్‌తో సహా ఊడపీకేశారు. ఆపై దానిని అదే వాహనానికి ఉన్న ఉన్న క్రేన్‌ సాయంతో ఎత్తుకెళ్లిపోయారు. 
 
ఉదయం డ్యూటీకి వచ్చిన ఓ బ్యాంకు సిబ్బంది అక్కడ జరిగిన భీభత్సాన్ని గుర్తించి చోరీ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. చోరికి గురైన మెషీన్‌ లో ఎంత డబ్బు ఉన్నదన్న విషయంపై బ్యాంకు అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. ఏదైనా నిర్మాణ రంగానికి చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.