రైల్వే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు

7 Jun, 2019 15:30 IST|Sakshi

మాస్కో : రష్యాలో ఇనుము దొంగలు బరితెగించారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఆర్కిటిక్‌ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పాత పడటంతో కొంతకాలంగా దానిని వినియోగించడం లేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి బ్రిడ్జి మధ్య భాగం అదృశ్యం అయింది. 75 అడుగుల పొడవు, 56టన్నుల బరువున్న వంతెన మధ్య భాగం అదృశ్యం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిడ్జి అదృశ్యానికి సంబంధించి తొలుత మే నెలలో రష్యాకు చెందిన వీకే సోషల్‌ మీడియా సైట్‌ వార్తలు ప్రచురించింది. అయితే స్థానికులు మాత్రం బ్రిడ్జిపై ఉన్న ఇనుము కోసమే దొంగలు దానిని కూలగొట్టారని ఆరోపించారు. 

మొదట వెలుబడిన ఫొటోలను చూస్తే బ్రిడ్జి నదిలో కూలిపోయినట్టుగా కనిపించింది. కానీ ఆ తర్వాత పదిరోజులకు విడుదలైన ఏరియల్‌ వ్యూ ఫొటోలను పరిశీలిస్తే నదిలో బ్రిడ్జి శకలాలు కనిపించలేదు. దీంతో బ్రిడ్జి సహజంగా కూలిపోలేదని తొలుత ఈ వార్తను ప్రచురించిన వీకే సైట్‌ తెలిపింది. అయితే ఇది దొంగల పనే అని భావిస్తున్న స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు