అమెరికాలో అతడు చెప్పినట్టే జరుగుతున్నాయి!

15 Jun, 2016 14:15 IST|Sakshi

భవిష్యత్ ను ముందే ఊహించి అతడు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి. అమెరికాలో ఏం జరగబోతుందో చెబుతూ గతేడాది డిసెంబర్ లో పాబ్లో రెయెస్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. దిగ్గజ బాక్సర్ మహ్మద్ అలీ, పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మరణం, ఆర్లెండో నైట్ క్లబ్ లో నరేమేధం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ వార్తల్లో నిలిచింది.

పాబ్లో రెయెస్ చెప్పినట్టుగా అమెరికాలో ఘటనలు జరుగుతుండడంతో అంతా విస్తుపోతున్నారు. 2016లో అమెరికాకు హిల్లరీ క్లింటన్ తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని, గోరిల్లా మరణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని, ప్రిన్స్, మహ్మద్ అలీ, కింబొ స్లైస్, డొనాల్డ్ ట్రంప్ చనిపోతారని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. అమెరికా చరిత్రల్లో భారీ కాల్పులు చోటు చేసుకుంటాయని కూడా ఊహించి చెప్పాడు. ఎవరినీ భయపెట్టడానికి తాను ఈ విషయాలు చెప్పడం లేదని, కానీ తన పేరును అందరూ గుర్తు పెట్టుకుంటారని తన పోస్ట్ లో రాశాడు.

అతడు చెప్పినట్టుగానే అమెరికాలో ఘటనలు జరుగుతున్నాయి. అతడు అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడని అందరూ ఆశ్చర్య పోతున్నారు. పాబ్లో రెయెస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు 2 లక్షల మందిపైగా దీన్ని షేర్ చేశారు. ఈ సంఖ్య ప్రతి నిమిషానికి పెరుగుతోంది. అయితే పాబ్లో రెయెస్ ఎవరు అనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

మరిన్ని వార్తలు