ట్రంప్‌కు 1001 రాఖీలు

5 Aug, 2017 15:38 IST|Sakshi
ట్రంప్‌కు 1001 రాఖీలు

గుర్‌గావ్‌(హర్యానా): అమెరికా అధ్యక్షుడికి హర్యానా మహిళలు రాఖీలు పంపిస్తున్నారు. మహిళలపట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్‌కు రక్షాబంధనం పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో సోదరభావంతో 1001 రాఖీలు పంపటం విశేషం. వెనుకబడిన మెవాట్‌ ప్రాంతంలోని మరోరా గ్రామాన్ని సులభ్‌ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఆ గ్రామ బాలికలు అమెరికా అధినేతకు వెయ్యిన్నొక్క రాఖీలు పంపిస్తోంది. సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ(ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ) అధినేత బిందేశ్వర్‌ పాఠక్‌ ఇటీవలే ఈ గ్రామానికే ట్రంప్‌ గ్రామం అని పేరు పెట్టారు. దీంతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

అయితే, నిబంధనలకు విరుద్ధంగా గ్రామానికి పేరు మార్చారంటూ అధికారులు అభ్యంతరం తెలపటంతో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రంప్‌ గ్రామ సూచిక బోర్డులను తొలగించారు. పున్‌హానా తహశీల్‌ పరిధిలోని ఈ గ్రామ జనాభా 1800లో ఎక్కువ మంది ముస్లిములే. ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ సంస్థ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లను ఈ గ్రామ మహిళలు తమ పెద్దన్నయ్యలుగా భావిస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అందుకే మోదీ ఫొటోలతో 501 రాఖీలను, ట్రంప్‌ ఫొటోలతో 1001 రాఖీలను తయారుచేసి పంపిస్తున్నారని వివరించారు. గ్రామ మహిళలు కొందరు ప్రధానమంత్రి మోదీని ఆయన నివాసంలో కలిసి రాఖీలు కట్టేందుకు ఢిల్లీ బయలుదేరారని పేర్కొన్నారు. ఈ గ్రామంలోని 140 నివాసాలకు గాను 45 మాత్రమే టాయిలెట్లు ఉండగా సులభ్‌ సంస్థ మిగతా 95ఇళ్లకు కూడా టాయిలెట్లు నిర్మించి ఇచ్చింది. గ్రామంలోని మహిళలు, బాలికల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.

మరిన్ని వార్తలు