ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని లాహోర్లో బుధవారం ఉదయం జరిగిన పేలుళ్లలో ముగ్గురు పోలీస్ అధికారులుతో సహా తొమ్మిదిమంది మృతి చెందారు. మరో 24మంది గాయపడ్డారు. ప్రసిద్ధిగాంచిన దాతా దర్బార్ షరీన్ వెలుపల ఈ పేలుళ్లు సంభవించాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని... పోలీస్ వాహనాలకు దగ్గరలో బాంబు పేలింది. బాంబు పేలుడు ధాటికి పలు వాహనలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు అద్దాలు పలిగిపోయాయి. ఇవాళ ఉదయం 8:45 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
గాయపడినవారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసులే లక్ష్యంగా దాడి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని పంజాబ్ ఐజీ ఆరీఫ్ నవాజ్ తెలిపారు. కాగా అత్యంత ప్రసిద్ధి గాంచిన దాతా దర్బార్ షరీన్ను సందర్శించుకునేందుకు ప్రతి ఏడాది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివస్తారు. తాజా దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.