ముస్లిం శిబిరాలపై యువతి టిక్‌టాక్‌ వీడియో

28 Nov, 2019 10:31 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో ఓ యువతి చేసిన టిక్‌టాక్‌ వీడియో రాజకీయ ప్రకంపనల్ని సృష్టించింది. ఫెరోరా అజీజ్‌ అనే యువతి మేకప్‌ వీడియో అంటూనే మధ్యలో చైనాలో నిర్భంధ శిబిరాల్లో ముస్లింలు మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని వివిధ రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారని మండిపడింది. వీగర్‌ ముస్లింలు శిబిరాల్లో నరకయాతన అనుభవిస్తున్నారని ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ వీడియోకు విశేష స్పందన వచ్చింది. మిలియన్ల వ్యూస్‌ రాగా లక్షల్లో లైకులు వచ్చి పడ్డాయి. దీంతో టిక్‌టాక్‌ యాజమాన్యం ఆమె అకౌంట్‌ను నిలిపివేసింది. అయితే అప్పటికే వైరల్‌గా మారిన ఈ వీడియోను అనేకమంది యూజర్లు తిరిగి పోస్ట్‌ చేశారు.

దీనిపై ఫెరోరా ట్విటర్‌లో స్పందిస్తూ అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా తనను అణిచివేయలేరని పేర్కొంది. చైనాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై తాను గొంతు విప్పి ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై టిక్‌టాక్‌ అధికార ప్రతినిధులు స్పందిస్తూ ఫెరోరా ఇతర అకౌంట్‌ నుంచి ఓ వీడియో క్లిప్‌లో ఒసామా బిన్‌లాడెన్‌ ఫొటోను షేర్‌ చేసిందని తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద సంబంధిత సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని తమ కంపెనీ సహించబోదని, దాన్ని అరికట్టడానికే యువతి అకౌంట్‌ను బ్లాక్‌ చేశామని స్పష్టం చేసింది. టిక్‌టాక్‌ యాజమాన్య స్పందనను ఫెరోరా ఖండించింది. తాను నిజాలు మాట్లాడితే చైనా ప్రభుత్వం భయపడి ఇలాంటి చర్యలు తీసుకుందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు