రైళ్లను ఆపిన నత్త!

23 Jun, 2019 21:57 IST|Sakshi

టోక్యో : సాంకేతికతకు, సమయపాలనకు చిరునామా జపాన్‌. ముఖ్యంగా ఇక్కడి రైళ్లు, బస్సులు ఒకటేమిటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ మొత్తం సమయానికి అనుగుణంగా నడవాల్సిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే సంబంధిత రవాణా వ్యవస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు సైతం బోలెడు. అలాంటి దేశంలో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. దాదాపు 12వేల మంది తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇంతకీ అన్ని రైళ్లను ఆపింది ఏంటో తెలుసా.. ఓ నత్త!.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దక్షిణ జపాన్‌లోని క్యూషూ రైల్వే కార్పొరేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది. మే 30న అనుకోకుండా రైల్వే వ్యవస్థలో ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కారణమేంటా అని వెతికిన అధికారులు ఎంతో శ్రమ తరవాత చివరకు రైల్వే ట్రాక్‌లకు సమీపంలోని ఓ విద్యుత్తు బాక్స్‌లో నత్త చనిపోయి ఉండడం గమనించారు. అది విద్యుత్‌ తీగల మధ్యకు వెళ్లడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైళ్లన్నీ స్తంభించిపోయాయి.  

మరిన్ని వార్తలు