'ఆ విషయంలో మలేషియా భేష్'

23 Nov, 2015 10:50 IST|Sakshi

కౌలాలంపూర్: భారత్-మలేషియాలు భద్రత విషయంలో పకడ్బందీగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య రక్షణపరమైన సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తీవ్ర వాదాన్ని, జాతి వివక్షతను రూపుమాపడంలో మలేషియా చర్యలు అద్భుతం అన్నారు. ఇస్లాం మత అసలైన విలువలు ఎత్తిచూపడంలో మలేషియా అగ్రభాగాన ఉందన్నారు. మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో ఉన్న మోదీ సోమవారం ఉదయం కౌలాలంపూర్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పుత్రజయ వద్ద మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు.

ఆ దేశ సైనికులు గౌరవ వందనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ, నజీబ్ మధ్య ముఖ్యంగా రక్షణ, సైబర్ సెక్యూరిటీవంటి అంశాలు చర్చకు రావడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మలేషియా సహకారాన్ని కోరారు. భారత్ లో పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా మర్చనున్న నేపథ్యంలో వాటి నిర్మాణం కోసం సహకారం అందించాలని కూడా మోదీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలేషియా విద్యార్థులు భారత్ లో చదువుకునేందుకు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు.

తోరణ గేట్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ కలిసి లిటిల్ ఇండియాగా భావించే కౌలాలంపూర్ లో తోరణ గేట్ ను ప్రారంభించారు. భారత స్మృతి చిహ్నం సాంఛీ స్తూపాన్ని పోలి ఉండేలా దీనిని నిర్మించారు. 2010 దీని నిర్మాణంపై ప్రకటన చేసి పూర్తిగా భారత్ నిధులతో దీనిని నిర్మించారు. దీని ప్రారంభానికి మోదీ వచ్చిన సందర్భంగా అక్కడి భారతీయులు, మలేషియా పౌరులు భారీ సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు. మోదీని చూసేందుకు పోటీపడ్డారు. తోరణ గేట్ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది కేవలం రాతి కట్టడం మాత్రేమే కాదని ఇరు దేశాలకు సంస్కృతికి ప్రతిబింబం అని కొనియాడారు. తోరణ గేట్ ను ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు