చైనాపై అమెరికా మళ్లీ సుంకభారం

10 May, 2019 20:50 IST|Sakshi

వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్‌ రెట్టింపు చేశారు. ఓవైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుండగా.. ట్రంప్‌ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు చైనా కూడా ఇందుకు ప్రతిగా  అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు సిద్ధమైంది. శుక్రవారం లేదా ఆ తర్వాత నుంచి చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు అమలవుతాయని యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్టర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతకుముందు చైనా నుంచి దిగుమతి చేసుకునే పలు, హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు, పాదరక్షలు ఇలా తదితర 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 10శాతం సుంకం ఉండేది. తాజాగా దాన్ని 25శాతానికి పెంచుతూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘తాజా పరిణామాలపై చైనా అసహనం వ్యక్తం చేసింది. ‘అమెరికాకు బదులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

మరిన్ని వార్తలు