ఆదివారం నాకు ఫోన్‌ చేయమని చెప్పాను : ట్రంప్‌

16 Jun, 2018 10:24 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌ - కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (ఫైల్‌ఫోటో)

ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది...ట్రంప్‌ - కిమ్‌ల భేటి గురించే. సింగపూర్‌ వేదికగా సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక భేటీ ఫలప్రదమైన సంగతి తెలిసిందే. సమావేశం ప్రారంభం నుంచి ఇరు దేశాల అధ్యక్షులు పాత వివాదాలను పక్కన పెట్టి నూతన చెలిమికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో అడుగు ముందుకు వేసి...ఏకంగా తన డైరెక్ట్‌ ఫోన్‌ నంబర్‌ను కిమ్‌కు ఇచ్చాడు. అంతేకాక ఏదైన సమస్య తలెత్తితే మొహమాట పడకుండా తనకు ఫోన్‌ చేయమని మరి చెప్పాడంట కిమ్‌కు.

ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఇదే హాట్‌ టాపిక్‌. ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నేను ఇప్పుడు అతనికి(కిమ్‌) ఫోన్‌ చేయగలను. అంతేకాక కిమ్‌కు ఏదైనా సమస్య వస్తే మొహమాట పడకుండా నాకు ఫోన్‌ చేయమని చెప్పాను. ఈ ఆదివారం నాకు ఫోన్‌ చేయమని కిమ్‌కు చెప్పానన్నా’డు. ఈ విషయం గురించి మీడియా...‘ఆదివారం మీరు ఎవరితో మాట్లడబోతున్నారు?’ అని అడగ్గా, అందుకు ట్రంప్‌ ‘ఉత్తర కొరియాలో ఉన్న నా దేశ ప్రజలు, అలానే ఉత్తర కొరియా ప్రజలతో మాట్లాడతానన్నా’డు.

మరిన్ని వార్తలు