'నాకు 15 మంది దోస్తులయ్యారు.. డిన్నర్‌ చేశాం'

27 Jan, 2018 15:32 IST|Sakshi

దావోస్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో కొత్తగా 15 మంది స్నేహితులు అయ్యారు. ఆ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా చెప్పారు. వారితో కలిసి డిన్నర్‌ కూడా చేసినట్లు వెల్లడించారు. వారిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారున్నట్లు తెలిసింది. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ట్రంప్‌ 20 నిమిషాలపాటు ప్రసంగించిన తర్వాత స్వల్ప కాలంపాటు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాస్‌ శ్వాబ్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్రంప్‌ సమాధానం చెప్పారు.

దావోస్‌లో కొత్తగా ఎవరితో పరిచయాలు అయ్యాయని ట్రంప్‌ను ప్రశ్నించగా పదిహేను మంది అని చెప్పారు. 'నేను గురువారం మధ్యాహ్నం దావోస్‌కు వచ్చాను. అదే రోజు రాత్రి 15 మంది కొత్త మిత్రులతో భోజనం చేశాను. నాకు తెలిసిన వారు అందులో ఒక్కరు కూడా లేరు. కానీ, వీరందరి గురించి మాత్రం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాను. నాకు ఇక్కడ 15మంది మిత్రులు దొరికేలా చేసిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరానికి, దాని వ్యవస్థాపకులైన మీకు నా ధన్యవాదాలు' అని ట్రంప్‌ చెప్పారు. వైట్‌ హౌస్‌ తెలిపిన వివరాల ప్రకారం  స్విస్‌ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌కు త్వరలో రానున్న సీఈవో వ్యాస్‌ నరసింహన్‌, నోకియా సీఈవో రాజీవ్‌ సూరి, డెలాయిట్‌ సీఈవో పునిత్‌ రేంజెన్‌తోపాటు, బేయర్‌, సైమెన్స్‌, ఏపీ వోల్వో, శ్యాప్‌, అడిదాస్‌, స్టాటోయిల్‌, నెస్ట్లే, ఏబీబీ, హెచ్‌ఎస్‌బీసీవంటి సంస్థల సీఈవోలతో ట్రంప్‌ భేటీ అయినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు