మూడ్ లేదు.. ఇక తెగతెంపులే 

15 May, 2020 08:26 IST|Sakshi

చైనాపై మరోసారి ట్రంప్ తీవ్ర ఆగ్రహం

చైనా అధ్యక్షుడితో  చర్చించే మానసిక స్థితిలేదు

పూర్తిగా సంబంధాలు తెంచుకుంటామంటూ తాజా బెదిరింపు

వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పదే పదే విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తో చర్చలు జరిపే మానసిక స్థితి (మూడ్) తనకు లేదని మండిపడ్డారు. అంతేకాదు చైనాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోనున్నామని, జిన్‌పింగ్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని  ట్రంప్  పేర్కొన్నారు.

ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. తాము చేయాల్సినవి చాలా వున్నాయి...చైనాతో మొత్తం సంబంధాలను తెంచుకునే యోచనలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నిజానికి జీ జిన్‌పింగ్‌ తనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయనీ, కానీ ప్రస్తుతం అతనితో మాట్లాడే ఆసక్తిలేదు. చాలా నిరాశకు గురయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించలేదని,  వైరస్ వ్యాప్తిని ఆపి వుండాల్సిందంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా పెట్టుబడుల నుండి యుఎస్ పెన్షన్ ఫండ్‌ను ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక)

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలమందిని పొట్టన పెట్టుకోగా, ఇందులో 86 వేలకు పైగా మరణాలు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన వెలువడింది. కాగా కోవిడ్-19 వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ట్రంప్ ప్రతీకారంగా చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల వ్యార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే.  (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు)

మరిన్ని వార్తలు