భారత్‌కు రాయితీలు నిలిపేయాలి

9 Sep, 2018 03:27 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

అమెరికా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే: ట్రంప్‌

షికాగో: అన్ని దేశాల కన్నా వేగంగా అమెరికా ఎదగాలంటే భారత్, చైనా వంటి వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు అందుతున్న రాయితీలు నిలిచిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. అమెరికాను ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తానన్నారు. చైనా గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సహకరిస్తోందని ఆరోపించారు. ‘కొన్ని దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరిగణిస్తున్నాం. అందుకే వాటికి రాయితీలిస్తున్నాం. ఇది వెర్రితనం.

భారత్, చైనా వంటి ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతగానో వృద్ధి చెందుతున్నాయి. కానీ తమను తాము ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ రాయితీలను పొందుతున్నాయి. మేం ఆ రాయితీలను నిలిపేయబోతున్నాం. నిలిపేశాం. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే. నేను ఇదే నమ్ముతా’ అని ట్రంప్‌ అన్నారు. ‘నేను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు పెద్ద అభిమానిని. కానీ వ్యాపారంలో మనం సరసంగా వ్యవహరించాలి. ఏడాదికి 500 బిలియన్ల అమెరికా డాలర్లను చైనా తీసుకొని తన దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవడాన్ని మేం అనుమతించం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు