ఆఖరి క్షణాలు.. ‘నాకు చావాలని లేదు’..

24 Aug, 2019 12:20 IST|Sakshi

అంకారా : ‘‘నాకు చావాలని లేదు’’ మాజీ భర్త చేతిలో పాశవికంగా పొడవబడి.. రక్త మోడుతూ ఓ మహిళ అన్న ఆఖరి మాటలివి. కూతురిని తనకు అప్పగించటం లేదన్న కోపంతో ఓ మాజీ భర్త కన్న కూతురిముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన టర్కీలోని సెంట్రల్‌ అనటోలియన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్‌ అనటోలియన్‌ కిరిక్కాలేకు చెందిన ఇమినే బులట్‌ భర్త ఫెడాయ్‌ వెరన్‌తో 4 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. వీరికి ఓ కూతరు ఉంది. కూతురి కస్టడీ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలనుంచి గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు కూతురి కస్టడీని బులట్‌కు అప్పగించింది. అయినప్పటికి కూతురిని తనకు అప్పజెప్పాలంటూ తరుచూ ఫెడాయ్‌, బులట్‌తో గొడవపడేవాడు.

ఎంత గొడవపడినా ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. ఆగస్టు 18న కూతురిని చూడాలంటూ ఫెడాయ్‌,బులట్‌ను కోరాడు. ఇందుకు అంగీకరించిన బులట్‌ కూతుర్ని వెంటబెట్టుకుని అక్కడి ఓ కేఫ్‌కు వచ్చింది. అక్కడ కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఫెడాయ్‌.. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పాశవికంగా పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. ఆఖరి క్షణాల్లో ‘‘నాకు చావాలని లేదు’’ అన్న ఆమె మాటలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యాయి. ఫెడాయ్‌పై సోషల్‌ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. అతడిని కఠినంగా శిక్షించాలని, మహిళలపై దాడులను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ టర్కీస్‌ ప్రజలు నిరసనలు చేపట్టారు.

చదవండి: మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో..

వైరల్‌: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా!

మరిన్ని వార్తలు