ట్విటర్‌ సీఈవో అకౌంట్‌ హ్యాక్‌

31 Aug, 2019 14:39 IST|Sakshi

ట్విటర్‌  సీఈవో,  సహ  వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ  ట్విటర్‌ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం  మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు.  ప్రధానంగా ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో బాంబు వుందంటూ ట్వీట్‌ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాదాపు 4 మిలియన్ల మంది  ఫాలోయర్లు ఉన్న ట్విటర్‌ సీఈవో ఎకౌంట్‌నే హ్యాక్‌  చేసి సైబర్ నేరగాళ్లు భారీ షా​కిచ్చారు. స్వయంగా  సంస్థ  సీఈవో ఖాతాకు భద్రత లోపించడం  చర్చనీయాంశమైంది. 

దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్‌ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.  అంతేకాదు ట్విటర్‌  ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది. అయితే  హ్యాకింగ్‌ను  పసిగట్టిన భద్రతా సిబ్బంది  డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్‌  ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. 

మరోవైపు డోర్సీ ట్విటర్‌ ఎకౌంట్ ఎలా హ్యాక్‌ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్‌ద్వారా హ్యాకింగ్‌ జరిగినట్టు గుర్తించామన్నారు.  మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను హ్యక్ చేసారన్నారు. 

కాగా డోర్సీ ఖాతా హ్యాక్‌ అవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన  సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు