మ్యాగీ నూడుల్స్కు బ్రిటన్ క్లీన్చిట్

1 Jul, 2015 20:10 IST|Sakshi

లండన్: భారత్లో నిషేధానికి గురైన మ్యాగీ ఉత్పత్తుల సంస్థ నెస్లేకు గొప్ప ఉపశమనం లభించింది. మ్యాగీ ఉత్పత్తులకు బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితమని, వీటిని తినడం ఎలాంటి హానికరం కాదని బ్రిటన్ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. భారత్లో తయారు చేసిన ఈ ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ అనుమతించిన స్థాయి మేర ఉన్నాయని పేర్కొంది. మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్ను పరీక్షించిన అనంతరం బ్రిటన్ ఎఫ్ఎస్ఏ నివేదిక రూపొందించింది. మ్యాగీ తయారీలో స్థాయి మేరకు పదార్థాలను వాడారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినియోగదారులకు భరోసా ఇచ్చింది.

మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. భారత్లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది.
 

మరిన్ని వార్తలు