కరోనాను జయించాడు

28 Jun, 2020 15:32 IST|Sakshi

భార్యా పిల్లలతో కలిసి ఇంటికి!

లండన్‌కరోనా మహమ్మారితో 95 రోజుల పాటు పోరాడి ప్రాణాంతక వ్యాధిని జయించి తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌కు చెందిన కీత్‌ వాట్సన్‌ మూడునెలలకు పైగా వైరస్‌తో పోరాడి మహమ్మారిని ఓడించాడు. 41 రోజులు ఐసీయూలో గడిపిన వాట్సన్‌ 23 రోజుల పాటు కోమాలో ఉన్నారు. ఓ దశలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ఇక బతకరని వాట్సన్‌ కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందచేశారు.

ధైర్యంతో తీవ్ర అనారోగ్యాన్ని అధిగమించిన వాట్సన్‌ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి పయనమయ్యారు. మూడు నెలలుపైగా చికిత్స అనంతరం వాట్సన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండగా వైద్య సిబ్బంది ఆయనను అభినందనల్లో ముంచెత్తారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరగా ఇంటివద్ద 100 మందికి పైగా స్నేహితులు, స్ధానికులు ఆయనను చప్పట్లతో స్వాగతించారు. దీర్ఘకాలం కరోనా మహమ్మారితో పోరాడి తాను ఇప్పటికీ సజీవంగా ఉన్న విషయం నమ్మలేకపోతున్నానని వాట్సన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి : ‘మహమ్మారికి భయపడితే ఆకలితో చస్తాం’

మరిన్ని వార్తలు