పార్వతీదేవీకి జపాన్‌ కంపెనీ అవమానం

9 Oct, 2017 18:59 IST|Sakshi

టోక్యో : జపాన్‌కు చెందిన వీడియో గేమ్స్‌ రూపొందించే ఓ సంస్థ హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. తాను కొత్తగా తయారు చేసిన ఫేట్‌ గ్రాండ్‌ ఆర్డర్‌(ఎఫ్‌జీవో) అనే గేమ్‌లో హిందువుల దేవత పార్వతీదేవీని ఓ పని చేసే వ్యక్తిగా రూపొందించి పెట్టి తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీనిపై వెంటనే స్పందించించిన నెవెడాకు చెందిన హిందూ పరిరక్షక సంస్థ చీఫ్‌ రాజన్‌ జెడ్‌ ఆ గేమ్‌ డెవలపర్‌ జపాన్‌ డిలైట్‌ వర్క్స్‌కు హెచ్చరిక లేఖలు పంపారు. తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బకొట్టారని, ఈ గేమ్‌ ద్వారా తమ భవిష్యత్తు లేకుండా పోయే ప్రమాదం ఉంటుందని వెంటనే దీనిపై స్పందించి ఎఫ్‌జీవో వీడియో గేమ్‌లోని పార్వతీదేవీ పాత్రను వెంటనే తొలగించాలని, కొత్తగా గేమ్‌ను ప్రారంభించాలని కోరారు. ఎఫ్‌జీవో గేమ్‌లో ఆడుతున్న వ్యక్తి మాస్టర్‌గా ఉండగా అందులో కొన్ని పాత్రలు ఉంటాయి.

ఆ పాత్రలు మాస్టర్‌ చెప్పిన పనిచేస్తుండాలి. ఆ పాత్రల్లో పార్వతీ దేవీ కూడా ఉంది. ఆమె కూడా మాస్టర్‌ చెప్పినట్లు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ గేమ్‌ చూసిన హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేవతా మూర్తియైన పార్వతీదేవీని సేవకురాలి పాత్రలో పెట్టి వీడియో గేమ్‌లో చేరుస్తారా అని మండిపడ్డారు. పైగా ఇందులో బెల్లీ డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా కూడా పార్వతీని రూపొందించారు. ఈ నేపథ్యంలో డిలైట్‌ వర్క్స్‌ సంస్థకు లేఖ రాస్తూ అందులో హిందువులకు సంబంధించిన అంశాలను వివరిస్తూ వాటిని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారా కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవద్దని, అలా చేస్తే హిందువులు మనోభావాలు దెబ్బతింటాయని, వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఈ గేమ్‌లో శివుడి ఆయుధం అయిన త్రిశూలాన్ని, వాహనం అయిన నందిని పార్వతీ దేవీ చేతుల్లో పెట్టారని పలు అభ్యంతరాలను అందులో చేర్చారు.

>
మరిన్ని వార్తలు