యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపణ
వాషింగ్టన్ : పోలీస్ కస్టడీలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో, అల్లర్ల వెనుక అతివాద సంస్థల కుట్ర దాగుందని అగ్రరాజ్యం ఆరోపించింది. నిరసనల మాటున అతివాద సంస్థలు హింసను ప్రేరేపించాయని అమెరికన్ అటార్నీ జనరల్ విలియం బార్ పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అతివాద ఆందోళనకారులు అవకాశంగా మలుచుకున్నారని ఆరోపించారు. యాంటిఫా వంటి ఇతర అతివాద గ్రూపులు పలు రాజకీయ అనుబంధం కలిగిన నటులు హింసాత్మక ఘటనల్లో పాల్గొంటూ ఇతరులను అందుకు ప్రేరేపించారని చెప్పేందుకు ఆధారాలున్నాయని బార్ పేర్కొన్నారు.
అయితే, ఈ హింసాత్మక నిరసనలకు అతివాదులు కారణం కాదని, ఇది అవకాశవాదుల పనేనని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహరాల శాఖ నిఘా నివేదిక పేర్కొన్న క్రమంలో బార్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అల్లర్ల వెనుక యాంటిఫా హస్తం ఉందని బార్తో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థను తప్పుపడుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో హింస, విధ్వంసానికి ‘భూగలూ’ ఉద్యమ సభ్యులు కుట్ర పన్నారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.