ముగ్గురు ఇండో–అమెరికన్లు దోషులే

14 Feb, 2019 04:19 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో మాదకద్రవ్యాల వ్యాపారం ఆధారంగా అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డ కేసులో ముగ్గురు ఇండో–అమెరికన్లు సహా ఆరుగురు దోషులుగా తేలినట్లు యూఎస్‌ న్యాయశాఖ తెలిపింది. టెక్సాస్‌లోని లారెడోకు చెందిన రవీందర్‌ రెడ్డి గుడిపాటి(61), హర్‌‡్ష జగ్గీ(54), నీరూ జగ్గీ(51)తో పాటు ఆండ్రియన్‌ హెర్నాండేజ్‌(మెక్సికో), గాల్వన్‌ కాన్‌స్టాంటీనీ, లూయిస్‌మోంటెస్‌ పాటినో(టెక్సాస్‌)లను కోట్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. లారెడోలోని ఫెడరల్‌ కోర్టు వీరిని దోషులుగా తేల్చిందని పేర్కొంది.

ఈ విషయమై అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ బ్రియాన్‌ మాట్లాడుతూ.. ‘అమెరికాలోని న్యూయార్క్, కెంటకీ, నార్త్‌ కరోలినా సహా పలు నగరాల్లో 2011–13 మధ్య మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాన్‌స్టాంటీనీ, పాటినోలు టెక్సాస్‌లోని లారెడోకు తరలించారు. ఇందుకు కార్లు, కొరియర్లు, బస్సులతో పాటు ప్రైవేటు విమానాలను సైతం వాడుకున్నారు. రవీందర్‌ రెడ్డికి చెందిన ఎన్‌వైఎస్‌ఏ, ఇంపాక్స్‌ ఎల్‌ఎల్‌సీ, హర్‌‡్ష–నీరూ జగ్గీలకు చెందిన ఎల్‌రినో ఇంటర్నేషనల్‌ కంపెనీలతో పాటు లారెడోలోని కొన్ని దుకాణాల ద్వారా ఈ నగదును వాడుకలోకి తెచ్చారు. ఆ తర్వాత లాభాలను మెక్సికో డ్రగ్స్‌ డీలర్లకు అందించారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు