కరోనా: ట్రంప్‌ మాట నిజమైంది!

27 May, 2020 15:09 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటేసింది. ‘కరోనా ధాటికి 75 లేదా 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నాం. ఇది చాలా భయంకరమైన విషయం’’ అని ట్రంప్‌ ఈ నెల మొదటి వారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కారణంగా 1,00,572 మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 17,25,275 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 బారిన పడిన వారిలో 4,79,969 మంది కోలుకున్నారు. (‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ కన్నీటి కథ)

అమెరికాలో అత్యధికంగా కరోనా ప్రభావానికి లోనైన న్యూయార్క్‌ రాష్ట్రంలో మరణాల సంఖ్య 30 వేలకు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 29,451 మరణాలు నమోదు కాగా, 3,73,622 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. న్యూజెర్సీలో 1,57,015 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, 11,197 మరణాలు సంభవించాయి. ఇలినాయి(1,13,195), కాలిఫోర్నియా(99,776), మసాచుసెట్స్‌(93,693), పెన్సిల్వేనియా(72,876) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఆగస్టు నాటికి దాదాపు లక్షా ముప్పై ఐదువేల మంది అమెరికన్లు మృత్యువాత పడతారని వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యువేషన్ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న మరణాల నమోదు చూస్తుంటే ఆగస్టులోపే ఈ సంఖ్యను చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. (చిన్ని ప్రాణికి కరోనా పరీక్షలు!)

మరిన్ని వార్తలు