న్యూయార్క్ : జమ్ము కశ్మీర్ భారత అంతర్గత అంశమని, ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్లో ఇండో-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం..ఈ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాదోపవాదాలను పక్కనపెట్టి యుద్ధం, ఉద్రిక్తతలకు దారితీసే ప్రేలాపనలను విడనాడా’లని తేల్చిచెప్పారు. ఇమ్రాన్ఖాన్ యుద్ధోన్మాదం అర్ధరహితమని అమెరికన్ కాంగ్రెస్కు సిలికాన్వ్యాలీ నుంచి డెమొక్రటిక్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా పేర్కొన్నారు. ఖన్నా వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్ సభ్యులు పెద్దఎత్తున స్వాగతిస్తున్నారు. కాగా కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల కాంగ్రెస్ సభ్యురాలు ఇలా అబ్ధుల్లాహి ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో తక్షణమే స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొని కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్ధరించాలని, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విధానాలను గౌరవించాలని ఆమె ట్వీట్ చేశారు.