ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం

19 Jun, 2015 11:07 IST|Sakshi
ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం

వాషింగ్టన్: దక్షిణ కరోలినాలోని చారిత్రక చర్చిపై దాడిపట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తుపాకీ సృష్టిస్తున్న విద్వంసాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాన్ని దశలవారిగా చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో నిర్మూలించుకోవాలని కోరారు. 'ఇది ఎంతో విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భం.. అలాగే నిర్మూలించాల్సిన సమయం' అని ఒబామా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినాలోని ఎమ్మాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్టు చర్చిపై ఓ శ్వేత జాతీయుడు దాడి చేసి తొమ్మిదిమందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం శ్వేత సౌదం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేయడంతోపాటు శ్వేత జాతీయులు చేస్తున్న చర్యలను విమర్శించారు. ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలకు స్వస్థిపలకాల్సిన అవసరంఉందని, అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రజలపై తుపాకీ దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. తక్షణమే వీటి విషయంలో వెనక్కి తిరగి చూసుకొని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డుల ప్రకారం ఇది పద్నాలుగో దాడి అని.. తాజాగా నల్లజాతీయుల చర్చిపై జరిగిన దాడి అందరినీ ప్రశ్నింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అమెరికాలో చరిత్రలో మచ్చగా ఉంటుందని, చీకటి అధ్యాయంలాంటిదని చెప్పారు.

మరిన్ని వార్తలు