మరోసారి పాక్‌ను హెచ్చరించిన అమెరికా 

19 Dec, 2017 21:12 IST|Sakshi

ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ 

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్ర నిరోధక చర్యల కోసం పాక్‌కు ఏటా భారీగా నిధులు ఇస్తున్నామని, వాళ్లు తప్పకుండా సాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఆదేశాల మేరకు ట్రంప్‌ సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ను ఆవిష్కరించారు. 

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం ఆ దేశంతో కుదుర్చుకునే ఒప్పందాలు వృథాయేనని ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రంప్‌ పాకిస్థాన్‌పై విమర్శలు ఆపడం లేదు. లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ను మళ్లీ అరెస్టు చేయాలన్న అమెరికా సూచనను పాక్‌ పట్టించుకోలేదు. అయినా పాక్‌పై కఠిన చర్యలకు మాత్రం ట్రంప్‌ వెనుకాడుతున్నారు. పాక్‌ మాత్రం ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూనే ఉండటం గమనార్హం.  

మరిన్ని వార్తలు