ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

20 Jun, 2018 11:16 IST|Sakshi
అమెరికా రాయబారి నిక్కీ హేలి

న్యూయార్క్‌ : ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా  ప్రకటించింది. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయటాన్ని ఖండిస్తూ ట్రంప్‌ పాలనపై ఐరాస మానవ హక్కుల మండలి అధ్యక్షడు హుస్సేన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్‌ అమెరికాపై వ్యాఖ్యలు చేసిన మరుసటి  రోజే ట్రంప్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అమెరికా రాయబారి నిక్కీ హేలి మాట్లాడుతూ.. సంస్థ ఆ పేరుకు అనర్హమైనదని ఆమె ఆరోపించారు.  

మండలిలో మార్పులు చేయటానికి అమెరికా చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇజ్రాయెల్‌ విషయంలో మండలి వ్యవహరిస్తున్న తీరు, మానవ హక్కులను వ్యతిరేకించే చైనా, క్యూబా, వెనిజులా, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో వంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వటాన్ని ఆమె తప్పుబట్టారు. మానవ హక్కులను పరిహాసం చేసే కపట సంస్థలో భాగంగా ఉండటం కుదరదన్నారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ఒకప్పుడు మానవ హక్కుల మండలిలో ఉన్నత భావాలు ఉండేవని, నేడు మానవ హక్కులను కాపాడటంలో మండలి విఫమైందన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సాహసంతో కూడుకున్నదని ఇజ్రాయెల్‌ ప్రశంసించింది

మరిన్ని వార్తలు