అగ్రరాజ్యంలో కరోనా పంజా.. ఒక్కరోజే 54 వేల కేసులు

3 Jul, 2020 08:33 IST|Sakshi
ప్రతీకాత్మక​ చిత్రం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్‌ మరింత విలయతాండవం చేస్తోంది. నిన్న(బుధవారం) ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో(గురువారం) రికార్డు స్థాయిలో కొత్తగా 55 వేల కోవిడ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.  ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అంతేగాక గత రెండు వారాల నుంచి అమెరికాలో రోజుకు 22 వేల కొత్త కేసులు నమోదవ్వగా 3 రోజుల నుంచి రెట్టింపుతో 40 వేలకుపైగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి.  

గత 14 రోజుల నుంచి కరోనా ప్రభావం​ దేశవ్యాప్తంగా అధికమవుతోంది. ఒక్క ఫ్లోరిడాలోనే అత్యధికంగా గురువారం దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశ్యవాప్తంగా కరోనా కేసులు ఒక్కరోజే లక్షల్లో నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసీజేస్‌ హెడ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు