వాషింగ్టన్ : 41 రోజుల ఉత్కంఠతకు మరి కొద్ది గంటల్లో తెర పడనుంది. మరో ఐదేళ్లపాటు ప్రధాని పీఠాన్ని అధిరోహించబోయేది ఎవరో మరి కాసేపట్లో తేలనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత ఎన్నికల తీరు పట్ల స్పందించింది. భారతదేశ ఎన్నికల సమైక్యత, యదార్థతపై తమకు నమ్మకం ఉందని.. విజేత ఎవరైనా సరే వారితో కలిసి ముందుకు సాగుతామని తెలిపింది.
ఈ క్రమంలో స్టేట్ డిపార్టమెంట్ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ మాట్లాడుతూ.. ‘భారతదేశంతో మాకు చాలా మంచి సంబంధాలున్నాయి. చాలా అంశాల్లో మేం ఒకరికొకరం సహకరించుకుంటు ఉంటాం. భారతదేశ ఎన్నికల సమగ్రత, పారదర్శకత పట్ల మాకు నమ్మకం ఉంది. విజేత ఎవరైనా సరే.. వారితో కలిసి ముందుకు సాగుతాం. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా సాజవుగా, ప్రశాంతంగా సాగింది. ఇందుకు గాను ఆ దేశ ప్రజలను అభినందిస్తున్నాను’ అని తెలిపారు.