దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

4 Jul, 2020 14:58 IST|Sakshi

వాషింగ్టన్​: దక్షిణ చైనా సముద్రం(ఎస్సీఎస్​)లోకి అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఈ మేరకు రెండు విమానవాహక నౌకలతో పాటు నాలుగు యుద్ధ నౌకలు శనివారానికి ఎస్సీఎస్​లో ప్రవేశిస్తాయని వాల్​ స్ట్రీట్​ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. (జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..)

ఎస్సీఎస్​లోని పారాసెల్​ దీవుల్లో చైనా యుద్ధ విన్యాసాలను ప్లాన్ చేసుకున్న సమయంలోనే అమెరికా కూడా విన్యాసాలకు దిగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు చెందిన యూఎస్​ఎస్​ రోనాల్డ్ రీగన్, యూఎస్​ఎస్​ నిమిట్జ్​ విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని అడ్మిరల్ జార్జ్​ వికాఫ్ పేర్కొన్నారు. (విజృంభిస్తున్న కరోనా డీ614జీ స్టెయిన్)

‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదన్నారు. 

పారాసెల్​ ద్వీపంపై వియత్నాంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దీవి తమదేనని వాదిస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో యుద్ధ విన్యాసాలపై వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనాను తప్పుబట్టాయి. ఇలాంటి వ్యవహారశైలి పొరుగు దేశాలతో చైనాకు ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందన్నాయి.

దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్​ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి.

మరిన్ని వార్తలు