కమాండర్‌ హత్య: వీడియో పోస్టు చేసిన అమెరికా

3 Jan, 2020 14:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్‌ టాప్‌ సైనిక కమాండర్‌ ఖాసీం సొలెమాన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖాసీం హత్యతో ఇరాకీలు సంబరాలు చేసుకుంటున్నారని, జాతీయ పతాకంతో ఇరాకీ వీధుల్లో కోలాహలం నెలకొందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పొంపియో ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘స్వేచ్ఛ కోసం ఇరాకీలు వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. జనరల్‌ సోలెమాన్‌ లేకపోవడమే అందుకు కారణం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద ఇరాకీలు జాతీయ జెండాతో, ఇతర బ్యానర్లతో పరిగెత్తుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఇరాక్‌లోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం   అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ టాప్‌ సైనిక కమాండర్‌, ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌, ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌ మృతిచెందారు. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు సోలెమన్‌ను చంపినట్టు అమెరికా ప్రకటించగా.. అమెరికా అవివేక చర్యకు తీవ్ర ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ హెచ్చరించింది. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
చదవండి: అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్‌
ట్రంప్‌ ఆదేశాలతోనే దాడి : వైట్‌ హౌస్‌

మరిన్ని వార్తలు