ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత

10 Feb, 2018 16:31 IST|Sakshi
వలసపోతున్న వెనెజులియన్లు

కొలంబియాకు వలసపోయేందుకు యత్నిస్తు‍న్న వేలాది వెనెజులా వాసులు

ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతలతో బలిపశులవుతామని భయాందోళనలు

సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిన కొలంబియా, బ్రెజిల్‌

కారాకాస్‌, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది.     

రాయిటర్స్‌ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్‌లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది.

ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్‌ మ్యాక్స్‌ వైలెన్స్‌’ అని పేరు పెట్టారు.

వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్‌ బొలివర్‌ ఇంటర్నేషనల్‌ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్‌ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది.

మరిన్ని వార్తలు