దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ

14 Nov, 2017 02:14 IST|Sakshi

హనోయ్‌: దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు సోమవారం అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్‌ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్‌ మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ హనోయ్‌ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. ‘సమస్యలు మరింత జఠిలం అయ్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోం. తూర్పు సముద్రంలో శాంతి సామరస్యాన్ని పెంపొందిస్తాం’అని పేర్కొన్నాయి. వియత్నాంలోని వివాదాస్పద కోస్తా తీర ప్రాంతంలో చైనా చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలో వియత్నాం ఆపేసింది. 

మరిన్ని వార్తలు