దయచేసి డబ్బు తీస్కోండి.. నన్నొదిలిపెట్టండి!

3 Jul, 2019 11:10 IST|Sakshi

బ్యాంకులకు విజయ్‌ మాల్యా ఆఫర్‌

లండన్‌ : వేలకోట్లకు ఎగనామం పెట్టి.. ​బ్యాంకులను మోసం చేసిన ప్రముఖ లిక్కర్‌ వ్యాపారీ విజయ్‌ మాల్యా మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై విరుచుకుపడ్డాడు. సీబీఐ తనకు వ్యతిరేకంగా క్షుద్రవేట సాగిస్తోందని మండిపడ్డాడు. భారత్‌కు అప్పగింత విషయమై అప్పీల్‌ చేసుకునేందుకు బ్రిటన్‌ హైకోర్టు విజయ్‌ మాల్యాకు  అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాల్యా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు గొప్పవాడు. న్యాయం ఇంకా మిగిలి ఉందిఒ. సీబీఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లిష్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌కు అవకాశమిచ్చింది. సీబీఐ అభియోగాలు తప్పు అని నేను చెప్తూ వస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.  బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా తిరిగి చెల్లిస్తానని, దయచేసి డబ్బు తీసుకొని.. తనను వదిలిపెట్టాలంటూ మరోసారి విజయ్‌ మాల్యా వేడుకున్నాడు. ‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినప్పటికీ.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా చెల్లిస్తానని మరోసారి ఆఫర్‌ ఇస్తున్నాను.  దయచేసి డబ్బు తీసుకోండి. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు కూడా డబ్బు చెల్లించి.. జీవితంలో ముందుకు సాగుతాను’ అని మాల్యా పేర్కొన్నాడు. సీబీఐ తనపై మోపిన ప్రాథమిక అభియోగాలను సవాల్‌ చేసేందుకు బ్రిటన్‌ హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని, తనను హేళన చేస్తున్న వాళ్లంతా ఈ విషయాన్ని అందరూ గమనించాలని మాల్యా కోరాడు. 

మరిన్ని వార్తలు