వైరల్‌: ఇలా చేస్తే మీకు వైరస్‌ సోకదు

16 Mar, 2020 20:16 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుండటంతో చేతులు కడుక్కోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఈ విషయాన్ని అరటిపండు వొలిచి నోట్లో పెట్టినంత సులువుగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చింది ఓ టీచరమ్మ. ప్రతి ఒక్కరికీ హ్యాండ్‌ వాష్‌ ఎంత అవసరమో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఇంకేముందీ.. అది అక్కడి పిల్లలనే కాదు.. అందరినీ మెప్పించింది. ఇంతకీ ఆ టీచర్‌ ఏం చేసిందంటే ఓ తెల్లని పాత్రను తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసింది. దాంట్లో నల్ల మిరియాలు వేసింది. వాటిని వైరస్‌ అనుకోమని చెప్పింది. అనంతరం ఎవరైనా ఒకరు వచ్చి దాన్ని టచ్‌ చేయమని కోరగా ఓ విద్యార్థిని వెళ్లి ఆ నీళ్లలో చూపుడు వేలు ఆనించింది. కానీ ఆ వైరస్‌(మిరియాలు)లో ఎలాంటి చలనం కనిపించదు. (ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు)

పైగా కొన్ని వేలికి కూడా అతుక్కున్నాయి. ఈ సారి పక్కనే ఉన్న సబ్బు నీటి పాత్రలో వేలు ఆనించి ఆ తర్వాత తెల్లని పాత్రలో వేలు తడపమంది. సరేనంటూ ఆ చిన్నారి సబ్బు నీటిలో వేలు ముంచి అనంతరం తెల్లని పాత్రలో ఆనించింది. వెంటనే అందులోని వైరస్‌(మిరియాలు) ఒక్కసారిగా దూరంగా వెళ్లిపోతుంది. వేలికి ఏదీ అంటను కూడా అంటదు. ఇది ఆ పిల్లలను ఎంతో ఆశ్చర్యపరిచింది. చూశారా పిల్లలు.. చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో అంటూ ఉపాధ్యాయిని ఈ ప్రయోగాత్మక పాఠాన్ని ముగిస్తుంది. ఈ వీడియోను లీ ట్రోట్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు తొమ్మిదిన్నర మిలియన్ల మందికి పైగా వీక్షించగా సుమారు 4 లక్షల లైకులు వచ్చాయి. (ఆదివారమూ శాకాహారమే!)

>
మరిన్ని వార్తలు