బీజింగ్: చైనాలోని షాంక్సీ ప్రావిన్స్, జింగ్ఝాంగ్కు చెందిన ఇతడి పేరు యాంగ్ జియాన్బిన్. ప్రస్తుతం 30లలోనే ఉన్న ఇతడికి నడుము చుట్టూ పెద్ద కణితి పెరిగిపోయింది. ఇది ఏకంగా 1.2 మీటర్ల పొడవు, వంద కిలోలకు పైగా బరువు ఉందట. 150 కిలోల బరువుతో నడవడం కూడా చేతగాని స్థితిలో ఉన్న యాంగ్కు శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించేందుకు బీజింగ్లోని పీఎల్ఏ హాస్పిటల్ వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జన్యుపరమైన ‘న్యూరోఫైబ్రోమటోసిస్’ అనే రుగ్మత వల్ల ఇలా కణజాలం పెరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఇతడికి చిన్ననాటి నుంచే కణితి పెరగడం ప్రారంభమైనా, పెద్దగా పట్టించుకోలేదు. గత రెండేళ్లుగా ఈ కణితి వేగంగా పెరిగి, అతడికి భారంగా మారిందని సోమవారం ‘గ్లోబల్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. యాంగ్ శస్త్రచికిత్సకు రూ. 48 లక్షల వరకూ ఖర్చవుతుందని, పేదవారైన ఇతడి తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్నారని పేర్కొంది.