భారత్‌-భూటాన్‌ దోస్తీ.. చైనా ఏమంటోంది?

2 Nov, 2017 15:19 IST|Sakshi

పొరుగు దేశాలైన భారత్‌-భూటాన్‌ మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై చైనా ఆచితూచి స్పందించింది. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో భారత్‌కు అండగా నిలిచిన భూటాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించడంపైనా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసింది. భారత్‌-భూటాన్‌ మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటే చూడాలని చైనా భావిస్తోందని పేర్కొంది. 

తాజాగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ వాంగ్‌చుక్‌ భారత్‌ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఈ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించేకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత్‌-భూటాన్ మధ్య సాధారణ సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు. 

డోక్లాం ప్రతిష్టంభన విషయంలో చైనాకు విరుద్ధంగా భారత్‌కు మద్దతునిచ్చినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింత్‌ తనను కలిసిన భూటాన్‌ రాజు ఖేసర్‌ను ఎంతగానో ప్రశంసించారు. కోవింద్‌ ప్రశంసలపై స్పందిస్తూ.. ’ భారత సరిహద్దు బలగాల అతిక్రమణ ఘటనను మీరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మా వైఖరేంటో ఎన్నోసార్లు తెలియజేశాం. దౌత్యమార్గాల్లో ఈ వివాదాన్ని భారత్‌-చైనా సముచితమైన రీతిలో పరిష్కరించుకున్నాయని మేం భావిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, భద్రతల కోసం చారిత్రక ఒప్పందాలకు కట్టుబడి భారత్‌, చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం’అని ఆమె అన్నారు. 

మరిన్ని వార్తలు