‘ఇక్కడ మేం బతకలేం’

2 Jul, 2018 19:00 IST|Sakshi

కాబుల్‌ ​: వరుస ఉగ్రదాడులతో అప్ఘానిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు భయానికి లోనవుతున్నారు. దేశంలో జీవించలేమంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలాలాబాద్‌లోని సిక్కులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్‌ ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది హిందువులు, సిక్కులు కాగా.. మరో ఇద్దరు అఫ్గాన్‌ జాతీయులు ఉన్నారు.

ఈ ఘటన తర్వాత ఆ దేశ హిందువులు, సిక్కులు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో మేం జీవించలేం అంటూ మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘ ఇక్కడ ఉంటే ఎక్కువ రోజులు బతకలేమని నాకు అర్థమయింది. ముస్లిం టెర్రరిస్టులు మమ్మల్ని బతకన్విరు’  అంటూ మృతుల బంధువు ఒకరు భయాన్ని వ్యక్తం చేశారు. మా మతాల వారిని ఉగ్రవాదులు వదలేలా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘మేం అప్ఘనిస్తానీయులమని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్‌ చేశారు. ముస్లీం టెర్రరిస్టులు మాపై దాడికి పాల్పడుతున్నారు’  అని ఆఫ్ఘాన్‌ హిందూ, సిక్కుల ఫ్యానెల్‌ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. 

‘హిందూ, సిక్కులకు అప్ఘాన్‌లో రాజకీయ, ఇతర అంశాలల్లో సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ పక్షపాత ధోరణితో ముస్లీంలు మమ్మల్ని అణచివేస్తున్నారు. ఉగ్రవాదులు వేధింపులకు తాళలేక​ వేలాది మంది ఇండియాకు వలస వెళ్లారు. ఇప్పుడు మాకు రెండే దారులు ఉన్నాయి, ఇండియాకు వలస వెళ్లడం లేదా ముస్లిం మతం స్వీకరించడం.అలా చేస్తేనే ఈ దేశంలో మేం బతకగల్గుతాం’  అని మృతుల బంధువులు వాపోతున్నారు.

కాగా అప్ఘాన్‌ హిందూ, సిక్కులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని రోజులైనా ఇండియాలో జీవించవచ్చని అప్ఘాన్‌ భారత రాయబారి విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వారికి మేం రక్షణగా ఉంటాం. అన్ని సౌకర్యాలు అందిస్తాం అని తెలిపారు.

మరిన్ని వార్తలు