కరోనాపై విజయం సాధించాం: జెసిండా అర్డెర్న్

27 Apr, 2020 14:57 IST|Sakshi

వెల్లింగ్టన్‌: కోవిడ్‌-19 వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ సోమవారం వెల్లడించారు. తమ దేశంలో వైరస్‌ విసృత వ్యాప్తి, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరిగినట్టు ఆధారాలు లేవని అన్నారు. న్యూజిలాండ్‌ కరోనాపై విజయం సాధించిందని ఆమె ప్రకటించారు. పటిష్ట లాక్‌డౌన్‌తోనే ఇది సాధ్యమైందని, దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని పేర్కొన్నారు. దానిలో భాగంగా మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ నాలుగో స్థాయిని సడలిస్తున్నామని అన్నారు. వ్యాపార కార్యకలాపాలు, ఆహారం పార్సిల్స్‌, పాఠశాలలకు అనుమతించారు. మహమ్మారి బారినపడకుండా దేశాన్ని రక్షించగలిగామని అర్డెర్న్ ఈ సందర్భంగా‌ ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: వామ్మో! ఖైదీల లాక్‌డౌన్‌ అంటే ఇలానా?)

దేశంలో నాలుగు వారాలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఆంక్షలు.. ఇకపై మూడో స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం నుంచి మూడో స్థాయి లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతాయని స్పష్టం చేశారు. అయితే, కరోనా పోరులో విజయం సాధించినప్పటికీ.. ఈ పోరాటాన్ని మరికొంత కాలం కొనసాగించాలన్నారు. దేశంలో కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయకపోతే పరిస్థితులు దారుణంగా ఉండేవని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, న్యూజిలాండ్‌లో‌ ఇప్పటివరకు 1469 కేసులు మాత్రమే నమోదు కాగా.. 19 మంది మరణించారు. గత కొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. ఆదివారం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
(చదవండి: అయ్యా బాబోయ్‌.. ఈ స్టంట్‌ ఎ‍ప్పుడూ చూడలేదు)

>
మరిన్ని వార్తలు