బీచ్లో బ్రిటన్ జంట పంట పండింది

17 Apr, 2016 14:07 IST|Sakshi

లండన్: మీరు ఎప్పుడైనా బీచ్ల వెంట నడిచి వెళుతుంటే సువాసనలు వెదజల్లే రాళ్లు కనుకొన్నారా.. ఒక వేళ నిజంగా కనుకొన్నారో ఇక మీ దశ మారినట్లే. ఎందుకంటే బంగారం కన్నా విలువైన ఆ రాళ్లను 'వేల్ వామిట్' అంటారు. దీనికే అంబరు అనే పరిమళ ద్రవ్యము అని పేరు కూడా ఉంది. అంటే మగ తిమింగిలాల జీర్ణవ్యవస్థలో చోటుచేసుకునే రసాయన క్రియల వల్ల ఏర్పడిన ఓ మృదువైన పదార్థం దాని కడుపులో అజీర్తిగా ఉండిపోయి వాంతు చేసుకోవడం ద్వారా బయటకు వస్తుందన్నమాట.

ఇలా వచ్చిన పదార్థం సముద్రంలో తేలియాడే క్రమంలో అలలతాకిడికి ఒడ్డున పడిపోతుంది. అలా పడిన ఆ రాయిలాంటి పదార్థం కేజీల్లో కూడా ఉండొచ్చు. చక్కటి సువాసన మాత్రం అది గుప్పున వెదజల్లుతుంది. అలా వెదజల్లే వేల్ వామిట్ మీకు దొరికిందా ఇక కోటీశ్వరులైపోయినట్లే. ఎందుకంటే దీనితో పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు.

అయితే, ఈసారి బ్రిటన్లో ఇద్దరుదంపతుల పంటపండింది. గ్యారీ, ఎంజెలా విలియమ్స్‌ అనే భార్య భర్తలు అలా మిడిల్టన్ సముద్రం ఒడ్డుగుండా నడిచివెళుతుండగా వారికి ఇది దొరికింది. అయితే, దానిని గుర్తించడం అంత తేలిక కాదని, బహుషా నిజంగా వారికి దొరికింది తిమింగలం వాంతు చేసుకోవడం ద్వారా బయటకొచ్చిన పదార్థమే అయితే, దాని విలువ కనీసం రూ.46,65,565.59(70 వేల డాలర్లు) ఉంటుందని ప్రముఖ రచయిత క్రిస్టోఫర్ కెంప్ అంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తం వేల్ వామిట్ దొరకలేదని గతంలో 2012లో ఎనిమిదేళ్ల బ్రిటన్ విద్యార్థికి 1.3 ఫౌండ్ల వేల్ వామిట్ దొరికిందని దాని ధర 63,000 డాలర్లు ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు