అడ్మిన్‌ తలచుకుంటే..!

3 Dec, 2017 02:45 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ ‘వాట్సాప్‌’.. గ్రూప్‌ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు అప్పగించనుంది. అనవసర సందేశాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోస్టు చేస్తూ.. గ్రూపులోని మిగిలిన సభ్యులను ఇబ్బందిపెడుతున్న వారిని నియంత్రించేలా యాప్‌లో మార్పులు చేస్తోంది. అడ్మిన్‌ తలచుకుంటే ఇలాంటి సందేశాలను నిలిపేయవచ్చని.. కొత్త సాంకేతికతను పరీక్షించే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ వెల్లడించింది.

గూగుల్‌ ప్లేలో అందుబాటులో ఉన్న వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.17.430లో ఈ సదుపాయం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయాన్ని కేవలం గ్రూపు అడ్మిన్‌లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఒక్కసారి సదరు సభ్యుడిని ఈ జాబితాలో చేరిస్తే.. ఆ సభ్యుడు గ్రూపులోని ఇతరులు పంపే సందేశాలను చదివేందుకు మాత్రమే వీలుంటుంది. తన సందేశాన్ని గ్రూపు సభ్యులందరికీ చేరవేయాలనుకుంటే సందేశాన్ని టైప్‌ చేసి ‘మెసేజ్‌ అడ్మిన్‌’ బటన్‌ నొక్కాల్సి ఉంటుంది. దీన్ని అడ్మిన్‌ ధ్రువీకరిస్తేనే ఈ మెసేజ్‌లు పోస్ట్‌ అవుతాయి. 

మరిన్ని వార్తలు