కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి: డబ్ల్యూహెచ్ఓ

26 Mar, 2020 11:45 IST|Sakshi

జెనీవా : మహమ్మారి కరోనా పోరులో ప్రపంచ దేశాలు తీసుకుంటున్న లాక్ డౌన్ చర్యలు సరిపోవని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్-19 ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లాక్ డౌన్ చర్యలతో పాటు మరో అవకాశాన్ని సృష్టించుకోవాలని పేర్కొన్నారు. రోజువారి మీడియా సమావేశంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ చర్యలతో పాటు ప్రపంచ దేశాలు మరో అవకాశాన్ని సృష్టించుకోవాలి. వైరస్ పై ఎదురు దాడికి ఇదే సరైన సమయం. ఐసోలేషన్, పరీక్షలు, చికిత్స, అనుమానితులను త్వరితంగా గుర్తించడం అత్యంత మేలైన మార్గాలు. వైరస్‌పై విజయానికి ఇవే వేగవంతమైన మార్గాలని కూడా చెప్పొచ్చు. అయితే వీటిని ఆయా దేశాలు ఎంత వేగంగా అమలు చేస్తాయనేది అత్యంత కీలకం'అని ఆయన పేర్కొన్నారు. (కరోనాపై యుద్ధం : భారత్‌పై చైనా ప్రశంసలు)

ఇక ప్రాణాంతక  కోవిడ్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 18 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. నాలుగు లక్షలకు పైగా బాధితులుగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్ విషయానికి వస్తే కేసుల సంఖ్య 645కు పైగా నమోదు కాగా.. 13మంది మృతి చెందారు.

>
మరిన్ని వార్తలు