కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్‌

23 Apr, 2020 13:19 IST|Sakshi

జెనీవా : కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. ఇంకా చాలా దేశాల్లో కరోనా తొలి దశలోనే ఉందని హెచ్చరించింది. కరోనా నియంత్రణలో ఉందని భావించిన కొన్ని దేశాల్లో.. వైరస్‌ తిరిగి పుంజుకుందని గుర్తుచేసింది. ఆఫ్రికా, అమెరికాలలో ఈ రకమైన పరిస్థితులు కనిపించాయని చెప్పింది. కరోనా నియంత్రణలో ఎటువంటి పొరపాటు చేయరాదని సూచించింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో మనం చాలా కాలం ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. అన్ని దేశాలు కరోనా నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సరైన సమయంలో(జనవరి 30న) గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించామని గుర్తుచేశారు. 

పశ్చిమ యూరప్‌లో కరోనా విజృంభణ కొద్దిగా తగ్గిందన్నారు. అయితే ఆఫ్రికా, సెంట్రల్‌ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లో కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నియంత్రణలో ఎలాంటి పొరపాటు చేయకూడదని.. ఇంకా చాలా కాలం దీనిపై పోరాడాల్సి ఉందని సూచించింది. భౌతిక దూరం నిబంధనను కఠినంగా అమలు చేయడం ద్వారా కొన్నిదేశాలు కరోనా వ్యాప్తి నెమ్మదించేలా చేయడంలో విజయవంతం అయ్యాయని.. కానీ కరోనా మహమ్మారి చాలా ప్రమాదకరమైనదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చాల వేగంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని అన్నారు. 

మరోవైపు అయితే కరోనా నియంత్రణలో డబ్ల్యూహెచ్‌ఓ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతుంది. టెడ్రోస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే తను రాజీనామా చేసేది లేదని టెడ్రోస్‌ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేత విషయంలో అమెరికా పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా కరోనా సోకింది. వారిలో 1.78 లక్షల మందికి పైగా మృతిచెందారు. 

చదవండి : ‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’

మరిన్ని వార్తలు