అమెరికాకు ‘ఆధార్‌’ సమాచారం!

27 Aug, 2017 08:10 IST|Sakshi
అమెరికాకు ‘ఆధార్‌’ సమాచారం!
- ట్వీటర్‌లో వికీలీక్స్‌ సంచలన వ్యాఖ్యలు
దుర్వినియోగమయ్యే అవకాశం లేదు: భారత్‌
 
వాషింగ్టన్‌: భారతీయుల ఆధార్‌ సమాచారం అమెరికాకు అందుబాటులో ఉందంటూ వికీలీక్స్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన గూఢచారులకు ఆధార్‌ డేటాబేస్‌ అందుబాటులో ఉందని ట్వీటర్‌లో ఆరోపించింది. ఆధార్‌ డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు సీఐఏ.. అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ కంపెనీని వాడుకుంటున్నట్లు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వికీలీక్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత్‌ ఖండించింది.

‘ఆధార్‌ డేటా చాలా సురక్షితంగా నిక్షిప్తమై ఉంది. వేరే ఏ ఏజెన్సీ కానీ, సంస్థ కానీ ఆ వివరాలను పొందే అవకాశమే లేదు’అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆధార్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించిన బయోమెట్రిక్‌ పరికరాలను సరఫరా చేసే కంపెనీల్లో క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ ముందువరుసలో ఉంది. వేలిముద్రలు, ఐరిస్‌ రికార్డు చేసే పరికరాలను సరఫరా చేసేందుకు 2011లో ఈ కంపెనీ అనుమతులు పొందింది.

రహస్యంగా డేటాను సేకరించేందుకు ‘ఎక్స్‌ప్రెస్‌ లేన్‌’అనే వ్యవస్థను సీఐఏ ఉపయోగించుకుంటోందని ‘గ్రేట్‌ గేమ్‌ ఇండియా’వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది. సీఐఏకు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ వద్ద బయోమెట్రిక్‌ వివరాలను సేకరించే వ్యవస్థ ఉందని, దీని ద్వారా వివరాలను అక్రమంగా సేకరిస్తుందని వివరించింది. పాకిస్తాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ జాడ వెతికేందుకు క్రాస్‌ మ్యాచ్‌కు సంబంధించిన పరికరాలను అమెరికా మిలిటరీ వాడుకుందని 2011లో వార్తలు వచ్చాయి. 
మరిన్ని వార్తలు