40 ఏళ్లు చీకటి గుహలో..60 ఏళ్లు కప్‌బోర్డులో..

15 Mar, 2020 14:47 IST|Sakshi
మామి స్టువర్ట్‌(ఫైల్‌)

కార్డిఫ్‌ : అది 1919 సంవత్సరం! వేల్స్‌కు చెందిన మామి స్టువర్ట్‌ అనే 26 ఏళ్ల యువతి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమెకోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇటు బంధువులు అటు పోలీసులు ఆమె గురించి వెతకటం దండగనుకున్నారు. సండర్‌లాండ్‌కు చెందిన మామి 1918లో జార్జ్‌ శాటన్‌ అనే ఓ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వేల్స్‌కు వచ్చేశారు. ఓ ఏడాదికి.. 1919లో ఆమె కనపించకుండాపోయింది. పోలీసులు ఆమె భర్తపై అనుమానంతో అతడ్ని విచారించారు. అయితే అతడే హత్య చేశాడనటానికి ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో వదిలేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత 1961లో వేల్స్‌లోని ఓ గనిలో ఆమె అస్తి పంజరం దొరికింది. దుండగులు ఆమెను దారుణంగా చంపి, మూడు భాగాలుగా చేసి గనిలోని ఓ చీకటి గుహలో పడేశారు. ఆమె అస్తిపంజరంపై ఉన్న నగల ఆధారంగా అది మామి స్టువర్ట్‌ అని గుర్తించారు.

ఆ తర్వాత దాన్ని కార్డిఫ్‌లోని ఫోరెన్సిక్‌ లాబరేటరీకి తరలించారు. ఆ అస్తిపంజరాన్ని లాబరేటరీలోని ఓ కప్‌బోర్డులో ఉంచారు. అలా 60 సంవత్సరాల పాటు మామి అస్తిపంజరం ఆ కప్‌బోర్టులోనే ఉండిపోయింది. కొద్దిరోజుల క్రితం మామి బంధువొకరు ఆమె అస్తిపంజరాన్ని బయటకు తెప్పించింది. మామి చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఆమె తల్లిదండ్రులను సమాధి చేసిన సండర్‌లాండ్‌ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు