ఒకే కాన్పులో ఆరుగురు జననం!

21 May, 2019 15:27 IST|Sakshi

క్రకౌ: పొలాండ్‌కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగశిశువులున్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జన్మించడం పోలాండ్‌ దేశంలోనే ప్రథమం. సోమవారం క్రకౌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ ఆరుగురి పిల్లలకు జన్మనివ్వగా.. ఒక్కొక్కరు కిలో బరువు ఉన్నారు. దీంతో వైద్యులు వారిని ఇన్‌క్యూబెటర్స్‌లో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.  29 వారాల గర్భవతైన ఆమెకు సిజేరియన్‌ చేసినట్లు యూనివర్సిటీ వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పొలాండ్‌ అధ్యక్షుడు అండ్రుజేజ్‌ దుడ ఆ దంపతులను ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘అబ్బురపరిచే వార్త.. పొలాండ్‌ దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం. ఆ దంపతులకు అభినందనలు. వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. పైగా సదరు మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషం.

ఇక ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం ఇది తొలిసారి కాదు. ఏడుగురు కూడా జన్మించిన ఘటనలున్నాయి. 1997లో యూఎస్‌లోని ఐయోవా రాష్ట్రంలో కెన్నీ, బాబి మెక్‌కాగే దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ దంపతులు యూఎస్‌లో చాలా ఫేమస్ అయిపోయారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీళ్లను పిలుపించుకుని వ్యక్తిగతంగా కలిశారు. అలాగే ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే తన షోకి ఈ దంపతులను ఆహ్వానించారు. మళ్లీ 22 ఏళ్ల తరవాత ఇరాక్‌లో ఏడుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. 1983లో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో గ్రహమ్‌ వాల్టన్‌, జనేట్‌ లీడ్‌ బెటర్‌ దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ పిల్లలు వాల్టన్‌ సెక్స్‌టుప్‌లెట్స్‌గా గుర్తింపు పొందారు.  

మరిన్ని వార్తలు