సెలవు కోసం యువతి చేసిన పని.. నవ్వులు పూయిస్తోంది

13 Jan, 2020 16:36 IST|Sakshi

ఉద్యోగస్థులు అర్జెంట్‌గా సెలవులు కావాల్సినప్పుడు ఏ కడుపు నొప్పో అని, కాలు నొప్పో అని అబద్దాలు చెప్పి తప్పించుకోవడం సహజమే. కానీ ఓ యువతి మాత్రం ఆఫీసుకు డుమ్మా కొట్టడం కోసం వెరైటీ అబద్దం చెప్పి.. నెటిజన్లను తెగ నవ్వించింది. అంతలా నవ్వుకునే పని ఏం చేసిందని అనుకుంటున్నారా?.. ఆఫీసుకు వస్తుంటే టైరు పంక్చర్ అయిందని బాస్‌కు చెప్పింది. అక్కడితో ఆగకుండా ప్రూఫ్ కోసం టైరుకు మేకు గుచ్చుకున్న ఫొటోను తీసి బాస్‌కు పంపించింది. దీంట్లో నవ్వాల్సింది ఏముందని అంటారా.. ఆమె పంపింది నిజమైన ఫోటో కాదు.. ఫేక్‌ ఫోటో. దీనిని ఆమె కొలీక్‌ పసిగట్టి ట్వీట్‌ చేసింది. 

‘అర్జెంటుగా అందరూ తమ పనులని కట్టిపెట్టి ఈ ఫోటోను చూడండి. ఇదీ నా సహోద్యోగి చేసిన నిర్వాకం. కారు టైరు పంక్చరైందని ఆమె మా బాస్‌కు ఓ ఫోటో పంపించింది. ఆ ఫోటోను కాస్త పెద్దదిగా చేసి చూడండి. టైర్‌లో దిగిన మేకును జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన నెటిజన్లు ఆ బొమ్మ నిజంకాదని పట్టేశారు. ఫోటోషాప్ ద్వారా ఆమె ఈ ఫేక్ చిత్రాన్ని సృష్టించదని తెలిసి..  ఆమె పడిన పాట్లకు పడపడి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు వేల్లల్లో లైకులు షేర్లు వచ్చిపడ్డాయి. ‘ఫేక్ ఫోటో పంపించేటప్పుడు ఇంకాస్త వెరైటీగా ఏమన్నా చేయొచ్చు కదా!’ అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. పంక్చర్‌ అతికించాను ఇక ఆపీస్‌కు రమ్మనండి అంటూ వెరైటీ ఫోటోలతో కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు