‘దొంగతనం చేశావ్ సరే..బిడ్డను మర్చిపోవడమేంటి?’ 

26 Aug, 2019 11:43 IST|Sakshi

బిడ్డ కోసం స్ట్రోలర్‌ తెచ్చేందుకు షాపునకు వెళ్లిన ఓ మహిళ దొంగతనాన్ని సీసీటీవీ బయటపెట్టింది. స్ట్రోలర్ కొట్టేసే తొందరలో ఆఖరికి బిడ్డను మర్చిపోయిన సదరు మహిళపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అసలు విషయమేమిటంటే... ఓ మహిళ తన పాపాయి, ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ స్టోర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ స్టోర్‌ యజమానితో మాటలు కలుపగా బిడ్డను పక్కన కూర్చోబెట్టిన సదరు మహిళ స్ట్రోలర్‌ను తీసుకుని ఎంచక్కా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె స్నేహితులు కూడా స్టోర్‌ నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత బిడ్డ లేదని గమనించి మళ్లీ ముగ్గురూ కలిసి స్టోర్‌లోకి వచ్చారు. పాపాయిని తీసుకువెళ్తుండగా వారిని పట్టుకున్న స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లపై చోరీకేసు నమోదైంది. 

ఈ నేపథ్యంలో తన షాపులో జరిగిన దొంగతనాన్ని వివరిస్తూ...‘ స్ట్రోలర్ కొట్టేయాలనే తొందరలో కొంతమంది ఎవరి కోసమైతే దానిని దొంగతనం చేస్తారో చివరకు వాళ్లనే ఇలా వదిలివెళ్తారు. దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం. అయితే స్టోర్‌లోకి తీసుకువచ్చిన పిల్లలను అలా వదిలేసి వెళ్లకండి. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నా’ అంటూ యజమాని సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో.. ‘నీ కక్కుర్తి తగలెయ్యా. దొంగతనం చేస్తే చేశావు. బిడ్డను ఎలా మర్చిపోయావు. నువ్వేం తల్లివి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకో’ అంటూ నెటిజన్లు ఎవరికి తోచిన తీరుగా వారు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు